అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయని తెలిపారు. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చని తెలిపారు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.














