చౌక ధరకే భారత్ కు ముడి చమురు సరఫరా చేస్తామంటూ రష్యా ఆఫర్ ఇవ్వడం అగ్రరాజ్యం అమెరికాకు కంటగింపుగా ఉంది. యుద్దానికి పూర్వం ఉన్న బ్యారెల్ చమురు ధరపై 35 డాలర్ల తక్కువకే సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడంతో, ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో భారత్ వంటి మిత్ర దేశాలతో వాణిజ్య బంధాన్ని పెంచుకోవడంపై రష్యా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భారత్ను హెచ్చరిస్తూ అమెరికా ప్రకటన చేసింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు పెంచుకోవద్దని అమెరికా కోరింది. భారత్ పెద్ద ముప్పును కొని తెచ్చుకుంటోందని వ్యాఖ్యానించింది. రష్యా చమురుపైనా ఆర్థిక ఆంక్షలను అమెరికా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు రష్యా ఇంధనంపై అమెరికా ఆర్థిక ఆంక్షలకు దిగలేదు. రష్యా నుంచి గతంలో మాదిరే భారత్ చమురు దిగుమతులు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాటిని పెంచుకోవద్దన్నది అమెరికా అభిప్రాయంగా ఉంది.














