కెనడాలో భారతీయులే లక్ష్యంగా గల ద్వేషపూరిత నేరాల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కెనడాలో నివసిస్తున్న భారతీయులతో పాటు విద్యా, ఉద్యోగాది కారణాలతో అక్కడికి వెళ్లానుకుంటున్న వారిని హెచ్చరించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని కూడా అందులో పేర్కొంది. ఈ అంశాలను కెనడాలోని భారత భారత విదేశాంగ శాఖ అధికారులు, దౌత్య అధికారులు కెనడా దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా విదేశాంగ శాఖ తెలిపింది. ద్వేషపూరిత ఘటనల వెనుకున్న నేరగాళ్లకు ఇప్పటివరకూ శిక్ష పడలేదని కూడా పేర్కొంది.
కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కెనడాలో ఉంటున్న భారతీయ పౌరులు, విద్యార్థులు తమ పేర్లను అక్కడి భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని కూడా సూచించింది. అత్యవసర సందర్భాల్లో భారతీయ విద్యార్థులు కెనడాలోని భారతీయుల సులువుగా సాయం పొందేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. కెనడాలో ఖలిస్తానీ అనుకూల రెఫరెండం జరిగిన నేపథ్యంలో కేంద్రం భారతీయులకు ఈ సూచనలు జారీ చేసింది.














