అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పట్లో ఆ దేశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతం పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. వాటి కింద ఉన్న రహస్య భూగర్భంలో ఆ దేశం అణు కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తోందని పేర్కొన్నారు.

మళ్లీ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఆపడానికి దానిని పూర్తిగా నాశనం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఇరాన్పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద దాదాపు 1,000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దానితో పికాక్స్ పర్వతం కింద అణు కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆ దేశం చర్యలు తీసుకుంటున్నట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసి యురేనియం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి త్వరలో సైనిక చర్య చేపడతామని ట్రంప్ తెలిపారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్లో తీవ్ర విధ్వంసం తప్పదని హెచ్చరించారు.





























