ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తన విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవడంతో అధికారం చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ట్రస్ రాజీనామాతో రిషి సునాక్ మరోసారి ప్రధాని రేసులో నిలిచారు. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలను అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు వంద మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. అయితే, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి ఆ పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బోరిస్.. హుటాహుటిన మళ్లీ బ్రిటన్కు బయలుదేరారు. ప్రధాని రేసునుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్ను కోరినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. ప్రధాని రేసు నుంచి తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలన్నా, లేక ప్రధాని కావాలన్నా కనీసం వంద మంది ఎంపీలు మద్దతు తెలపాలి. ప్రస్తుతం ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్కు వంద మంది ఎంపీలు మద్దతిచ్చారు. ఇక, బోరిస్ జాన్సన్కు ఇప్పటి వరకు 44 మంది మద్దతు ఇవ్వగా, పెన్నీ మోర్డాంట్కు 21 మంది మద్దతు ఉంది. ముగ్గురిలో రిషి సునాక్కు ఎక్కువ మంది మద్దతు లభించడంతో ఆయన బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.