ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్ అన్నారు. బహ్రెయిన్లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీడీ జనార్దన్ మాట్లాడుతూ 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. సీఎంగా ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు నాయుడు నూతన వరవడి సృష్టించారు.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ల్యాండ్ ఫూలింగ్ విధానంలో ప్రభుత్వంపై భారం పడకుండా 33 వేల ఎకరాల భూమి సేకరించారు. ఇది చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైంది. సీఎం జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపించడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యం. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరం అని అన్నారు.
టీడీపీ బహ్రెయిన్ విభాగం అధ్యక్షుడు రఘునాథబాబు నేతృత్వంలోని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కౌన్సిల్ కన్వీనర్ హరిబాబు, బహ్రెయిన్ టీడీపీ ఉపాధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఏవీ రావు, కోశాధికారి బొల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు.