భారత్-యూకే మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరింది. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొన్నాథన్ రేనాల్డ్స్లు గత వారం ఖరారు చేసిన తుది ఒప్పందానికి రెండు దేశాలూ ఆమోదం తెలిపాయి. ఎఫ్టీఏ చర్చలు విజయవంతంగా ముగిసినట్టు ఇరు దేశాల ప్రధానులు అధికారికంగా ప్రకటించారు. ఒప్పందం నేపథ్యంలో భారత్లో బ్రిటీష్ విస్కీ, జిన్, కార్ల ధరలు తగ్గనున్నాయి.

యూకే ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇప్పుడున్న 100 శాతం టారీఫ్ 10 శాతానికి తగ్గిస్తారు. ఇరు దేశాల వాణిజ్యానికి ఎఫ్టీఏ కొత్త మార్గాలను వేస్తుందని, ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి పెంచుతుందని, ఇరు దేశాల దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పునాది వేస్తుందని భారత్, యూకే ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
