పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగుతున్న సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలకు స్వస్తి పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని డిజిటల్ పద్ధతిలో ఆమోదించినట్లు ఇరుదేశాల ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. జీ7 విందు ముగించుకుని ఫ్రాన్స్లోని వర్సయ్స్ ప్యాలెస్ నుంచి ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వయంగా ధ్రువీకరిస్తూ సంతకం పూర్తయింది అని ప్రకటించారు.

గత ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్ వర్చువల్ విధానంలో ప్రాథమికంగా సంతకాలు చేయగా, దేశాధినేతల తుది ఆమోదం లభించింది. మొత్తం 14 కీలక పాయింట్లతో కూడిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఇరుదేశాల ఘర్షణలవల్ల మూతపడిన వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా తక్షణమే పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించి, వారి చమురు, ఇంధన ఎగుమతులకు అమెరికా అనుమతి ఇవ్వనుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని, కొనుగోలు చేయబోమని ఈ ఒప్పందంలో హామీ ఇచ్చింది.




























