అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టింది మొదలు అక్కడి ప్రవాస భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. 40 శాతం మంది భారతీయ అమెరికన్లు ఆ దేశాన్ని వీడాలని భావిస్తున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. అమెరికాలో భారత సంతతి ప్రజలు 52 లక్షల మంది నివసిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

వీళ్లందరిలో అమెరికా డ్రీమ్ కనుమరుగు అవుతున్నదని సర్వే అభిప్రాయపడింది. ఈ మార్పునకు ప్రధాన కారణం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణమే. కార్నెగీ ఎండోమెంట్ తాజా సర్వేలో భాగంగా1,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలు విశ్లేషించగా, అమెరికాను వీడాలని తరచూ ఆలోచిస్తున్నామని 14 శాతం మంది, అప్పుడప్పుడు ఆలోచించామని 26 శాతం మంది చెప్పారు. ప్రతి పది మందిలో ఆరుగురు (58 శాతం) అమెరికా రాజకీయాలతో విసిగిపోయామని చెప్పగా, 41 శాతం మంది వ్యక్తిగత భద్రతపై ఆందోళనతో ఉన్నట్టు సర్వే పేర్కొన్నది.















