కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేసి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.


రాష్ట్రం అభివృద్ధిని కళ్లకు కట్టిన శకటాల ప్రదర్శన
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియచెప్పాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రతిబింబించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ (H.A.N.U.M.A.N.), గ్రేట్ గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ ప్రాజెక్టుల నమూనాలు ఆకట్టుకున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన పల్లెపండుగ, అడవితల్లిబాట, స్వచ్ఛ రథాలు అంశాలపై శకటాలు విశేషంగా ఆకర్షించాయి. విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర, సాంకేతిక శకటాల్లో 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించిన శ్రీ పవన్ కళ్యాణ్ చిత్రం, విద్యార్థులు రూపొందించిన రోబో ఉప ముఖ్యమంత్రివర్యులకు నమస్కరించడం ఆహుతులను ఆకట్టుకుంది. పోలీసు జాగిలాల ప్రదర్శనలో భాగంగా ఒక జాగిలం ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నమూనా శకటం, నీటిపారుదల, విద్య, వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు కూడా వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. అనంతరం విద్యార్థుల సాంస్కృతికి ప్రదర్శనలు దేశభక్తిని కళ్లకుకట్టాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుని రాజశేఖరం, శాసనసభ్యులు పంతం నానాజీ, నిమ్మకాయల చిన్న రాజప్ప,వనమాడి వెంకటేశ్వరరావు, శ్రీమతి వరుపుల సత్యప్రభ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తలాటం నాగవెంకట సత్య, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















