తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి పొరుగు దేశం నేపాల్ లో అరుదైన తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఇండో నేపాల్ కవి సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మంది ప్రఖ్యాత కవులు కవితా గానం చేశారు. వందమందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి నేపాల్ రాజధాని ఖాట్మండులో క్రిస్టల్ పశుపతి హోటల్ వేదిక అయ్యింది. ఐఏఎస్ అధికారి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తన మిత్రబృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో చేపట్టిన నేపాల్ యాత్రలో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జివి శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సమ్మేళనంను ప్రారంభించారు.

శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వ జనీనమైనదని యాత్రల వలన సాహిత్య కారులకు ప్రపంచ జ్ఞానం విస్తృతమవుతుందని అన్నారు. ఈ కవి సమ్మేళనంలో బుర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్,పల్లి సుజాత,గోపాల్ మాదిశెట్టి, రావికంటి శ్రీనివాస్,గంగాధర్ స్తంభంకాడి,సివి శ్రీనివాస్, డాక్టర్ కూరెల్లి పద్మాచారి, కృష్ణ గోపాల్, శ్రీనివాస్ రావు ముత్తినేని , డా దాసోజూ జ్ఞానేశ్వర్,సంపత్ అశోక్ జ్యోతి, గోనె శ్రీనివాస్ ప్రేమలత తదితరులు పాల్గొని కవితలు వినిపించారు. గోపాల్ మాదిశెట్టి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.





























