తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్లు మనుగడ సాగించాలంటే పర్సంటేజీ విధానాన్ని తప్పకుండా అమలు చేయాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి అనే నినాదంతో జరిగిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇకపై సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెంచబోమని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హామీనిచ్చింది. గత ఆర్నేళ్లుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి బాగోలేదని, వారిని ఆదుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని, ఓ నిర్మాతగా తాను వందశాతం వారికే మద్దతునిస్తానని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ఇతర రాష్ర్టాల్లో థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలులో ఉందని, తెలుగులో మాత్రం రెంటల్ పద్దతిలో ఎందుకు విడుదల చేస్తున్నారో ఓసారి ప్రశ్నించుకోవాలని, ఇకపై జీవోలు వచ్చినా థియేటర్లలో టికెట్ రేట్లను పెంచబోమని నిర్మాత శిరీష్ రెడ్డి అన్నారు.

తాము థియేటర్లను బంద్ చేయడం లేదని, ఎవరైతే పర్సంటేజ్ ఇస్తున్నారో వాళ్ల సినిమాలను ప్రదర్శిస్తామని చెబుతున్నామని, ఇప్పటికే పలు అగ్ర నిర్మాణ సంస్థలు ఈ విధానంలోకి వచ్చాయని, మిగిలిన వారుకూడా పర్సంటేజ్ పద్దతిని అమలు చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ కోరారు. సింగిల్ స్క్రీన్లు మూతబడితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు చాలా నష్టమని, సింగిల్ స్క్రీన్లను అందరం రక్షించుకోవాలని నిర్మాత సునీల్ నారంగ్ విజప్తి చేశారు.















