ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్లో చేరుకున్నారు. అక్కడి తెలుగు వారు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ నగరాల సదస్సు( World Cities Summit)లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు.అందులో భాగంగానే సింగపూర్ లోని భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే తో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్స్ , క్వాంటం టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడుల అనుకూలతను వివరించారు. ఏపీ లో రైతులు ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులను పండిస్తున్నారని , ఉద్యాన పంటలను ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామని చెప్పారు. ఆహార రంగంలో ట్రేసబులిటీ స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. రోబోటిక్, మెడికల్ డివైసెస్, హార్డ్ వేర్ రంగాల్లో సహకారం అందించాలని, సింగపూర్ టెక్నాలజీ అవసరాలను తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉందని తెలిపారు.


ఈ సందర్భంగా శిల్పక్ అంబులే మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, ఈకో సిస్టమ్ లో సింగపూర్ చాలా ముందు ఉందని అన్నారు. భారత్ లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ఆశక్తిగా ఉందని తెలిపారు. ఏపీ లో పెట్టుబడులకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్ట్ లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భారత్ అతిపెద్ద మానవ వనరులను కలిగి ఉందని. ఏపీ లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే నినాదంతో వెళుతున్నాం అని చెప్పారు. ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమలకు వేగంగా అనుమతులు భూములు కేటాయించామని , పరిశ్రమలకు ఇదే సరైన సమయం అని అన్నారు. ఈ సమావేశంలో హై కమిషనర్ శిల్పక్ అంబులే తో పాటు మంత్రి నారాయణ, పలువురు సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్ట్ లు పాల్గొన్నారు.





























