సామాజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కట్టడికి పలు దేశాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అరబ్ దేశం యూఏఈ కూడా చేరింది. సామాజిక మాధ్యమ వేదికల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదించింది. దాంతో ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్ దేశం గా యూఏఈ నిలిచింది.

కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఖాతాలను తెరిచేందుకు అనుమతి ఉండదు. అంతేకాదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లోని కొన్ని రకాల ఫీచర్లపై వీరికి యాక్సెస్ కల్పించకూడదు. వయసు సంబంధిత కంటెంట్పై ఆంక్షలు, స్క్రీన్ టైమ్, యాప్ వినియోగ సమయంపై పరిమితి వంటి రూల్స్ను ఆయా ప్లాట్ఫామ్లు తీసుకురావాల్సి ఉంటుంది. సోషల్ మీడియాతో పిల్లలకు పొంచి ఉన్న ముప్పును తప్పించడంతో పాటు ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది.





























