తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం.. ఫేజ్-II విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్… ఫేజ్-I స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ.. రుణ సంస్థ ఎంపిక… మెట్రో ఫేజ్-II విస్తరణ.. నిర్మాణ వ్యయం… అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని నిర్ణయించారు. దీనికి కన్సల్టెంట్గా SBICAPSని ఎంపిక చేశామని ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారని తెలిపారు.





























