అమెరికాలో హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎత్తివేసింది. హెచ్ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వొచ్చని స్పష్టం చేసింది. నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని కూడా పేర్కొంది. ఎయిడ్స్కు దారితీసే హెచ్ఐవీతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వారు వాడుతున్న మందులు తల్లిపాల ద్వారా బిడ్డకు వైరస్ సోకే ముప్పును ఒకశాతంలోపునకే పరిమితం చేస్తున్నట్టు కొలరాడో యూనివర్సిటీ హెచ్ఐవీ నిపుణురాలు, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా అబౌగి తెలిపారు. హెచ్ఐవీని అదుపులో ఉంచే చికిత్సా విధానం దశాబ్దం క్రితం విస్తృతమైంది. అంతకు ముందు తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్ సోకే ముప్పు 30 శాతంగా ఉంటే ప్రస్తుతం అది ఒక శాతానికి తగ్గిం ది.

1990ల మొదట్లో అమెరికాలో ప్రతి సంవత్సరం 2 వేలమంది చిన్నారులు హెచ్ఐవీ బారినపడేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లోపే ఉంది. అమెరికాలో హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి ఏటా ఐదువేల మంది బిడ్డలకు జన్మనిస్తున్నారు. హెచ్ఐవీ తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వవద్దంటూ వైరస్ వెలుగు చూసి తొలినాళ్లలో అంటే 1980లలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రతిపాదించింది. ఇప్పుడు చికిత్సా విధానాలు పెరగడం, హెచ్ఐవీ సంక్రమణను అదుపులో ఉంచే మెరుగైన మందులు అందుబాటులోకి రావడంతో ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.
