అట్లాంటా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కుటుంబ మూలాలను, మన సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలను గౌరవిస్తూ ప్రత్యేకంగా ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తర అమెరికాలో ఒక స్వచ్ఛంద సంస్థ పెద్దల కొరకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం బహుశా ఇదే తొలిసారి.


‘తరాలను అనుసంధానించడం’:
తానా ఈ వేడుకను ‘తరాలను అనుసంధానించడం’ (Reconnecting Generations) అనే థీమ్తో నిర్వహించింది. ఈ వేడుకలో పెద్దల కోసం రకరకాల వినోద కార్యక్రమాలు, సంప్రదాయ ఆటలు నిర్వహించారు. ఎండ వేడికి ఉపశమనం కలిగించేలా అతిథులకు చల్లని మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు అందించారు. అనంతరం అందరూ కలిసి పండుగలా సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ‘తానా పాఠశాల’ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తమ మాతృభాషను, సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండటంలో ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతోందని అక్కడకు వచ్చిన తల్లిదండ్రులు, పెద్దలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, శ్రీనివాస్ లావు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), అంజయ్య చౌదరి లావు (మాజీ అధ్యక్షుడు) ఈ వేడుకను నిర్వహించిన వారిని అభినందించారు. పులానీ జాస్తి, మాలతీ నాగభైరవ, వినయ్ మద్దినేని, శ్రీనివాస్ ఉప్పు, కోటి కందిమల్లు, చైతన్య కోరపాటి, మహేష్ కొప్పు, శ్రీను రామానందం, మురళి బొద్దు, రాజేష్ జంపాల, అనిల్ యలమంచాలి, శిరీష కాట్రగడ్డ, హరి అడ్డంకి, శరత్ పుట్టి, సంజీవ్ ఎక్కలూరి, ముఖర్జీ వేములపల్లి, విజయ మద్దిపట్ల, శ్రీధర్ వీ, సుజాత దేవరపల్లి, స్వప్నా యార్లగడ్డ, సుశ్మా కొర్రపాటి, పాఠశాల అట్లాంటా కో ఆర్డినేటర్ వాణి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.


కార్యక్రమం తానా నాయకురాలు సోహిని అయినాల స్వాగతోపన్యాసంతో మొదలైంది. పూలాని జాస్తి, మాలతి నాగభైరవ పెద్దలందరినీ సాదరంగా ఆహ్వానించారు. మధుకర్ యార్లగడ్డ ఈ వేడుకను విజయవంతం చేసిన వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శేఖర్ కొల్లు ఈ ఈవెంట్ పర్యవేక్షణ బాధ్యతలు చూసుకున్నారు. నిర్వాహకుడు సునీల్ దేవరపల్లి మాట్లాడుతూ, “పెద్దల మీద ప్రేమను చాటడానికి, కుటుంబ బంధాలను బలపర్చడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. వారితో గడిపే కొద్దిపాటి సమయం, పంచుకునే కథలు మన విలువలను కాపాడుతాయి” అని తెలిపారు.


ఈ కార్యక్రమానికి ఆర్థికంగా అండగా నిలిచిన బిర్యానీ పాట్, మన విందు, ఎపిక్ ఈవెంట్స్, మారుతి ఫుడ్స్, మిస్టిక్ ఫ్లేవర్స్, సాయిబాబు మద్దినేని, ఓమ్స్ క్లీనర్స్, ఇండిఫ్రెష్ సంస్థలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెద్ద సంఖ్యలో పాల్గొని సహాయం చేసిన యువ వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఈ వేడుకలో పాల్గొని, పెద్దల సన్మాన కార్యక్రమానికి తమ మద్దతు తెలియజేసిన ‘మైత్రి కమ్యూనిటీ’కి చెందిన విజు చిలువేరు మరియు వారి బృందానికి తానా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.చివరగా, శ్రీనివాస్ లావు మాట్లాడుతూ, పెద్దలను కేవలం ఒక రోజు మాత్రమే కాదు, ప్రతిరోజూ ప్రేమతో, గౌరవంతో చూసుకోవాలని కోరారు. తానా పాఠశాల లేదా తదుపరి కార్యక్రమాల గురించి వివరాలకు తానా అట్లాంటా టీమ్ను సంప్రదించవచ్చని సూచించారు.





























