భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ)కి సంగీత నివాళిగా డల్లాస్లోని తెలుగు కళాభిమానులు సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – ఆ2భ్, ఫ్రిస్కోలో నిర్వహించారు.


కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాయనిగా జానకి ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించడం విశేషమని అన్నారు. హాస్యపాత్రల స్వరం, రెండేళ్ల పసిపాప నుంచి తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకు ఏ స్వరాన్నాయినా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం ఆమెకే సొంతమని తెలిపారు. సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు వంటి ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం గొప్పదని పేర్కొన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల భాషల్లో 50,000 కు పైగా పాటలు పాడిన జానకి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ నివాళి అర్పించారు.


డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జానకి గానం భారతీయ సంగీతానికి అపూర్వమైన వరం అని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు. నిర్వాహకులు రామన్ వీరంరాజు, అనంత్ మల్లవరపు మాట్లాడుతూ విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. బాల గణపవరపు అందించిన ఆడియో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ఆ2భ్ యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.






























