
పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున భారత్ చేసిన దాడులపై ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత్-పాక్ సంయమనం పాటించాలని, వైరాన్ని వెంటనే ముగించుకోవాలని సూచించాయి. భారత్-పాక్ సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య వైరం వెంటనే ముగియాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దౌత్య మార్గాల ద్వారా భేదాలను పరిష్కరించుకోవాలని రష్యా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరిస్తామని యూకే తెలిపింది. యూఏఈ కూడా భారత్-పాక్ మధ్య చర్చలు జరగాలని కోరింది. ఇరు దేశాలు చర్చల ద్వారా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఖతార్, జపాన్ కూడా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకున్నాయి.
