Namaste NRI

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై..మరోసారి వైఖరి స్పష్టం చేసిన భారత్‌

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించ గలదని, అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగలుగుతారన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ భద్రతా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న డిమాండ్‌కు భారత్‌ మద్దతు తెలిపింది.1988లో భారతదేశం పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ప్రత్యక్షంగా, అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. రెండు దేశాల సూత్రంపై ఇరు దేశాలు పనిచేయాలని భారత నాయకత్వం పదేపదే నొక్కి చెబుతుందన్నారు. అప్పుడే శాంతి స్థాపన జరుగుతుందన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వంపై తగిన సమయంలో పునరాలోచన జరుగుతుందని, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఉంటుందని తెలిపారు.  గత నెలలో అమెరికా ఈ పాలస్తీనా డిమాండ్‌ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 1974 సంవత్సరంలో పాలస్తీనా ప్రజల ఏకైక, చట్ట బద్ధమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను గుర్తించిన మొదటి అరబ్యేతర దేశం భారతదేశం కావడం గమనార్హం.

Social Share Spread Message

Latest News