ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, నావికా దళం వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్ పాల్గొన్నారు. ఈ విమానాల కొనుగోలుకు ఈ నెల 9న భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కాంట్రాక్టులో భాగంగా సింగిల్ సీటర్ విమానాలు 22, ట్విన్ సీటర్ విమానాలు నాలుగు మన దేశానికి వస్తాయి.

లాజిస్టికల్ సపోర్ట్, భారత నావికా దళ సిబ్బందికి శిక్షణ, మన దేశంలోనే విడిభాగాల తయారీ వంటివి కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ విమానాల రాక 2029 చివరి నుంచి ప్రారంభమై, 2031 నాటికి పూర్తవుతుంది. అత్యాధునిక రాఫెల్-ఎం యుద్ధ విమానాల రాకతో సముద్రాలపై యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు మన దేశానికి మరింత పెరుగుతాయి. హిందూ మహా సముద్రంలో ముప్పును ఎదుర్కొనే సత్తా కూడా పెరుగుతుంది.
