మతసామరస్యంతో అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.


పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. “రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు. విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు అజారుద్దీన్ , పొన్నంప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.















