
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు సానియా చందోక్ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 5న ముంబైలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ భేటీలో అర్జున్తో పాటు సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా కూడా పాల్గొన్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే సానియా. ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలో మిస్టర్ పాస్ పెట్ స్పా సంస్థను నడుపుతోంది. చాలా ఏళ్ల నుంచి సచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉంది.

సచిన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించారు. కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తూ, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని కోరుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాలతో కలిసి ఫొటోలు దిగారు. అర్జున్, సానియా ప్రత్యేకంగా ప్రధానితో కలిసి ఫొటోలు దిగడం విశేషంగా మారింది.














