అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అయితే వైట్హౌస్పై దాడే లక్ష్యంగా ఈ ట్రక్కు ట్రాఫిక్ బారియర్స్ను పలుమార్లు ఢీకొట్టినట్టు తాజాగా తేలింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు తెలుగు సంతతికి చెందిన కందుల సాయివర్షిత్ (19)ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు చెప్పిన వివరాలు పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను కూడా షాక్కు గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా ట్రక్కుతో దాడికి యత్నించినట్టు నిందితుడు సాయివర్షిత్ పోలీసులకు తెలిపాడు.దీనికోసం ఆరు నెలలుగా పక్కా ప్లాన్ వేసి ఈ దాడికి యత్నించినట్టు వెల్లడించాడు. ఈ మేరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి.


శ్వేతసౌధంలోకి ప్రవేశించి, అధికారాన్ని కైవసం చేసుకొని అమెరికాకు నేతృత్వం వహించడమే నా లక్ష్యం అని వర్షిత్ పోలీసులకు తెలిపాడు. అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అడగ్గా నా ప్రయత్నానికి అడ్డొస్తే, అధ్యక్షుడు బైడెన్నే కాదు, ఎవర్నైనా చంపేస్తా లేదా గాయపరుస్తా అని వర్షిత్ చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. హిట్లర్ అంటే నాకు ఇష్టం. ఆయనకు నేను ఫ్యాన్. హిట్లర్ ఓ బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది అని వర్షిత్ పేర్కొన్నట్టు తెలిపారు. వైట్హౌస్పై దాడి కేసులో వర్షిత్పై మారణాయుధాల వినియోగం, నిర్లక్ష్య డ్రైవింగ్, అధ్యక్షుడిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.















