సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది.

సాయిధరమ్తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించాడు. విరూపాక్ష ప్రపంచాన్ని కళ్లముందుంచాడు. సాంకేతికంగా అన్ని విభాగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దారు. నాకు సెట్లో ఆరోగ్యం బాగా లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో మా నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్కు కృతజ్ఞతలు. ఈ మిస్టిక్ స్టోరీ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అన్నారు. రంగస్థలం షూటింగ్ టైంలో సుకుమార్గారికి ఈ కథ చెప్పాను. కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. సాయిధరమ్తేజ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంటుంది అని దర్శకుడు తెలిపారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది యూనివర్సల్ కథాంశం. అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఈ సినిమాలో తాను నందిని అనే పాత్రను పోషించానని కథానాయిక సంయుక్త మీనన్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ, శ్యామల, అభినవ్, అజయ్, కెమెరామెన్ శ్యాందత్ తదితరులు పాల్గొన్నారు.















