అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లోని సియాటెల్ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్లో దుండుగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, క్షతగాత్రుల్లో రెండేళ్ల బాలుడు కూడా ఉండటం గమనార్హం.సియాటెల్లో బైట్ ఆఫ్ సియాటెల్ పేరిట ప్రతి ఏటా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం 1982 నుంచి ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా వందలాది ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, మ్యూజిక్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకకు సుమారు 3.5 లక్షల మంది హాజరవుతుంటారు. ఎప్పటిలాగే ఈవెంట్ నిర్వహిస్తుండగా వేదిక లోపలి నుంచి పలుమార్లు తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో ప్రాణభయంతో జనాలు బయటకు పరుగులు తీయగా, అక్కడ అంతా అస్తవ్యస్తంగా మారింది. అయితే సియాటెల్ సెంటర్లో కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు.





























