కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ బలగాలు జరిపిన దాడిలో ఒక నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నావికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశ భద్రతను ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోమని స్పష్టంచేసింది. ఈ చర్యకు పాల్పడిన ఉక్రెయిన్కు రాబోయే రోజుల్లో తగినశాస్తి జరుగుతుందని, యుద్ధం మరింత ముదరకుండా చూడాలంటే కీవ్ వైఖరిని ఐరోపా దేశాలు వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.

పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమకు రష్యా-ఉక్రెయిన్ పోరుతో ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ పదేపదే చెబుతున్నప్పటికీ, రష్యా నుంచి ఇరాన్ శాటిలైట్ సమాచారాన్ని పొందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. గల్ఫ్ ప్రాంతాలు అమెరికా మిలిటరీ స్థావరాలపై రష్యా సేకరించిన ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ తన దాడుల కోసం వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన ఆంక్షలవల్ల చైనా తదితర దేశాల నుంచి వస్తువుల రవాణాకు ఇరాన్కు ఈ కాస్పియన్ సముద్ర మార్గమే దిక్కుగా మారింది. అలాంటి కీలకమైన దారిలో నౌకపై దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.





























