బలగం చిత్రం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ఎల్లమ్మ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం బలమైన భావోద్వేగాలను, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తెరపై ఆవిష్కరించనున్నదని చిత్రబృందం చెబుతున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. డీఎస్పీ కెరీర్లోనే ఇదొక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎల్లమ్మలో ఆయన పోషిస్తున్న పర్షి పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.

సింపుల్ డ్రెస్లో, చేతిలో కిరీటాన్ని పట్టుకుని సహజమైన చిరునవ్వుతో నిలబడ్డ దేవిశ్రీప్రసాద్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన ముఖంలో అమాయకత్వం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నవి. అన్ని భాషల ప్రేక్షకులకూ కనెక్టయ్యేలా ఈ సినిమా ఉండబోతున్నదని, తొలి సినిమానే అయినప్పటికీ డీఎస్పీ పర్షిగా ఒదిగిపోయి నటిస్తున్నారని, ‘బలగం’ తర్వాత మనసుల్ని తాకే మరో కథ ఎల్లమ్మ అని దర్శకుడు వేణు యెల్దండి చెబుతున్నారు. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగానే కాక, సంగీత దర్శకుడిగా కూడా తన మార్క్ని చూపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్న ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.





























