రవితేజ హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇరుముడి పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి రెండో సింగిల్ యాలాలో యాలాలో వెన్నెల్లో ఎన్నెన్ని ముచ్చట్లో అనే మధురమైన ఫ్యామిలీ మెలోడీని విడుదల చేశారు. కుటుంబ బంధాలు, ఆప్యాయత, భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ పాట తొలి వినికిడిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ హృదయాన్ని హత్తుకునే సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ తన మెలోడీ స్వరాలతో పాటను మరింత అందంగా తీర్చిదిద్దారు. విడుదల చేసిన పోస్టర్లో రవితేజ తన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా కనిపించడం సినిమా భావోద్వేగ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 21న ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని అధికారికంగా స్పష్టం చేశారు.





























