ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడున్న భారత పౌరులకు మన రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు ఎవ్వరూ రావద్దని సూచించింది. కీవ్ పశ్చిమ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారిని తిరిగి ఆయా నగరాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. వీలైతే పశ్చిమ సరిహద్దు దేశాలతోపాటు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకునే రష్యా దాడులు పెంచిన నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం మరోసారి మన పౌరులను అప్రమత్తం చేసింది.
ఉక్రెయిన్లో ప్రస్తుతం అత్యంత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లు, హోటళ్లు, వసతి గృహాలు లేదా ప్రయాణంలో ఇలా మీరు ఎక్కడున్నా ఆందోళన చెందకుండా, జాగ్రత్తగా ఉండండి అంటూ ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ల్వీవ్, ఖార్కివ్ నగరాలపై శక్తిమంతమైన బాంబు దాడులు జరుగుతోన్న నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. ఈ సమయంలో పాస్పోర్టులతో పాటు అత్యవసరమైన డాక్యుమెంట్లను కూడా తమ దగ్గర ఉంచుకోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.














