కువైత్ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రవాసులపై వేటు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని కీలక శాఖల్లో ప్రవాస ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కువైటీలకు అవకాశం ఇస్తోంది. దీనికోసం అక్కడి ప్రభుత్వం 2017 నుంచి కువైటైజేషన్ పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ ద్వారా భారీ సంఖ్యలో ప్రవాస ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా కువైత్ మరో సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నాటికి ఏకంగా ఏడున్నర లక్షల మంది వలసదారులను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే, వారందరూ ఈజిప్ట్ దేశానికి చెందిన ప్రవాస కార్మికులు కావడం గమనార్హం. వీరిలో వచ్చే నెల చివరి వరకు 2.50 లక్షల మందిని తొలగించనుంది. అలాగే వచ్చే ఏడాది నాటికి మరో 5 లక్షల మంది వరకు ఈజిప్టియన్లపై వేటు వేయనుంది. ఇలా మొత్తంగా 7.50 లక్షల మంది ఈజిప్ట్ కార్మికులకు ఉద్వాసన పలికేందుకు కువైత్ ప్రణాళిక సిద్ధం చేసింది.














