
అంతర్జాతీయ వేదికలపై భారత్పై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఈ క్రమంలో జెనీవా వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 58వ సమావేశంలో భారత్పై పాకిస్థాన్ తీవ్ర విమర్శలు చేసింది. జమ్ము కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది.

భారత రాయబారి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ పాకిస్థాన్ నాయకులు, ప్రతినిధులు వారి సైనిక ఉగ్రవాద సమూహం నిర్దేశించిన అబద్ధాలను ప్రచారం చేయడం విచారకరం. ఇస్లామిక్ దేశాల కూటమిని తన వాణిగా మార్చుకుని దుర్వినియోగానికి పాల్పడి అపహాస్యం చేస్తోంది. మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశం వల్ల ఈ కౌన్సిల్ సమయం వృధా కావడం దురదృష్టకరం. పాకిస్థాన్ కపటత్వం, అమానవీయ చర్యలతో అసమర్థ పాలనను కొనసాగిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంటే, ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవాన్ని కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టి సారిస్తుంది. మా నుంచి పాకిస్థాన్ ఈ విలువలు నేర్చుకోవాలి. మాపై ఆరోపణలు మాని, మీ దేశంలోని ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించారు.
