Skip to main content

Namaste NRI

బంగ్లా-భారత్ బంధం బలపడేనా? 

బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో డార్క్‌ ప్రిన్స్‌గా, దేశ శక్తివంతమైన రాజకీయ వారసుల్లో ఒకరిగా కనిపించిన తారిఖ్‌ రహ్మాన్‌ ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ బీఎన్‌పీ విజయ ఢంకా మోగించడంతో అంతిమంగా అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. బంగ్లాదేశ్‌ రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్‌ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే తారిఖ్‌ రహ్మాన్‌కు శుభాకాంక్షలు ప్రకటించి పొరుగుదేశంతో స్నేహసంబంధాలను పునరుద్ధరించుకోవడంపై తన ఆసక్తిని సూచనప్రాయంగా వెల్లడించింది. 2024లో షేక్‌ హసీనా పదవీచ్యుతితో ఉభయ దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ప్రధానిగా తారిఖ్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయమని తేలిపోవడంతో భారత్‌తో బంగ్లాదేశ్‌ సంబంధాలు మళ్లీ గాడిలో పడే అవకాశాలపై జోరుగా రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో 17 ఏండ్ల స్వీయ ప్రవాస జీవితం గడిపి బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చిన తారిఖ్‌ మాటలను బట్టి చూస్తే భారత్‌కు కొంత సానుకూలతే కనిపిస్తున్నది.

తారిఖ్‌ జియాగా బంగ్లాదేశీయులు ప్రేమగా పిలుచుకునే బీఎన్‌పీ చైర్మన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాటలోనే బంగ్లాదేశ్‌ ఫస్ట్‌(తొలి ప్రాధాన్యత) అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రాంతీయ శక్తులైన భారత్‌, చైనా, పాకిస్థాన్‌తో సమానదూరం పాటిస్తామని ఆయన వాగ్దానం చేయడం భారత్‌కు మంచి సంకేతంగా భావించారు. భౌగోళికంగా భారత్‌తో బంగ్లా బంధం విడదీయలేనిది. రెండు దేశాలు వాణిజ్య, విద్యుచ్ఛక్తి, కనెక్టివిటీ ద్వారా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడం తారిఖ్‌కు తొలి ప్రాధాన్యతల్లో ఒకటని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత్‌ కూడా ముందుగానే తన సంసిద్ధతను సూచించింది. అంతేగాక, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల కూడా తారిఖ్‌ వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన చేసిన కొన్ని ప్రసంగాలను బట్టి అర్థమవుతున్నది.

Social Share Spread Message

Latest News