
ఉక్కు, అల్యూమినియానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా ప్రతీకార చర్యలు చేపట్టాయి. అమెరికాకు చెందిన 28 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఈయూ ప్రకటించింది. ఇప్పటివరకు అమెరికా వస్తువులపై ఉన్న టారిఫ్ సస్పెన్షన్ను ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్డెర్ లెయెన్ ప్రకటించారు. అమెరికా 28 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధించడానికి సిద్ధపడుతుండగా, తాము కూడా 26 బిలియన్ యూరోల (28 బిలియన్ డాలర్లు) విలువైన ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. 27 సభ్య దేశాల తరఫున వాణిజ్య వ్యాపార ఘర్షణలను చక్కదిద్దే బాధ్యతను కమిషన్ నిర్వహిస్తోంది.తాము సంప్రదింపులకు ఎప్పుడూ సిద్ధమేనని ఆమె చెప్పారు. రాజకీయ, ఆర్థిక భౌగోళిక అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సుంకాల భారాన్ని తమ దేశాలు ఆర్థికంగా మోయలేవని పేర్కొన్నారు.

ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతోపాటు జౌళి, చర్మ వస్తువులు, గృహోపకరణాలు, ఇంటి పనిముట్లు, ప్లాస్టిక్, కలప వంటి వస్తువులతోపాటు పౌల్ట్రీ, బీఫ్, సీఫుడ్, నట్స్, గుడ్లు, చక్కెర, కూరగాయలు వంటి వ్యవసాయ పదార్థాల ధరలపై కూడా ప్రభావం ఉంటుందని కమిషనర్ చెప్పారు. తాను విధించే పన్నుల వల్ల అమెరికా ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పన జరుగుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ యూరపు, అమెరికాలో కూడా ఉద్యోగాలు పోవడంతోపాటు ధరల పెరుగుదల ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అమెరికా పన్నులతో వ్యాపారాలే కాక వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
