దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. దిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినళ్లను ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది.

వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతోపాటు మహబూబ్నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత స్టేషన్ల వివరాల్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ప్రస్తుతం హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంట, గంటన్నర సమయం పడుతోంది. ఉదయం ఆయా స్టేషన్లలో ప్లాట్ఫారాల సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మూడు టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.

ప్రస్తుత అవసరాలతో పాటు పెరుగుతున్న హైదరాబాద్ మహానగర జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. రానున్న రెండు దశాబ్దాల్లో వృద్ధి చెందే రైలు ప్రయాణాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మూడు భారీ టెర్మినళ్లకు రైల్వేశాఖ రూపకల్పన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లుగా ఉన్న జనాభా, 2031లో 1.84 కోట్లకు, 2047లో 3.30 కోట్లకు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.
















