యూకేలోని మిల్టన్ కీన్స్లోని శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆధ్వర్యంలో పవిత్ర శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో, వేద పండితులు రంగనాథ నేతృత్వంలో తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు సంప్రదాయ మంత్రోచ్చారణల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో చేపట్టిన గొప్ప చొరవ అయిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ, టీటీడీ సహకారంతో యూరప్లోని వివిధ నగరాల్లో పవిత్ర శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది. వేడుకలో భాగంగా తిరుమల నుంచి వచ్చిన వేద పండితుల మంత్రాలు , దైవిక ఆచారాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్ర కల్యాణ క్రతువును జరిపించారు. భక్తులకు దైవిక కృపతో ఆశీర్వాదాలను సూచించే టీటీడీ లడ్డూ ప్రసాదం, తీర్థంతో పాటు అక్షింతలను అదజేశారు. తెలుగు ప్రవాసుల ఐక్యత, భక్తి, సాంస్కృతిక వారధికి ఈ వేడుక ప్రతిబింబంగా నిలిచింది.కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన స్వచ్ఛంద సేవలకు పాటు, భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

లోకనాథ మారం, విక్రమ్ పరిటాల, రవికుమార్ నూనే, బాలాజీ వరదరాజన్, ప్రమోద్ పారేపల్లి, హర ప్రసాద్ గండ్లూరి, లక్ష్మీ నరసింహారావు యడవల్లి, గణేశన్ పిళ్లై, సాయి లింగినేని, యషాస్ అయ్యంగార్, జనార్ధన చింతపంటి, పద్మనాభన్ సారంగపాణి, పురుషోత్తమ యెనుముల, శివకుమార్ సిరిగిరి తదితర సభ్యులు బృందంగా ఏర్పడి వేడుకను విజయవంతం చేయడానికి కృషి చేశారు. మిల్టన్ కీన్స్ సిటీలో శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆఫ్ మిల్టన్ కీన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో 1,800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
















