ఇండోనేషియా వేదికగా జరిగిన జీ`20 సదస్సుల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు మధ్య కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది. సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతలు మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ మీడియాకు విడుదల చేసింది కెనడా ప్రధాని కార్యాలయం. అయితే ఈ వ్యవహారాన్ని జిన్పింగ్ తప్పుబట్టారు. ట్రుడో సమక్షంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వివరాలు మీడియాకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదన్నారు. చర్చలు జరిపే పద్దతే ఇది కాదన్నారు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదని వాదించారు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందామని జిన్పింగ్ కుండబద్ధలు కొట్టారు.
అయితే దానికి కెనడా ప్రధాని ట్రోడో గట్టి బదులే ఇచ్చారు. చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ కాదన్నారు. చర్చల్లో అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరవని, కొన్నింటికి సమ్మతి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇద్దరు నేతలు మాట్లాడుకునేది కెనడా మీడియా తన కెమెరాలో రికార్డ్ చేశారు.














