ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డల్లాస్ పర్యటనలో ఉన్న జయరాం కోమటి అమెరికాలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ స్థలిని సందర్శించారు. అర్వింగ్(డల్లాస్)లో ఉన్న స్మారక స్థలిలో పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జయరాం కోమటికి గవర్నింగ్ బోర్డ్ సభ్యులు అనంత్ మల్లవరపు స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు. ప్రముఖ వ్యాపార వేత్త రామ్ గుల్లపల్లి మరియు పలువురు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న గాంధీ స్మారక స్థలి కేవలం ప్రవాస భారతీయులకే కాకుండా ఇతర దేశస్థులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అన్ని పార్టీల నాయకులు, అమెరికాలోని నాయకులు కూడా సందర్శించ దగిన స్ఫూర్తి దాయక యాత్రస్థలి అని అన్నారు. ప్రవాస భారతీయుల ఐక్యతకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. ఈ సందర్భంగా ఈ మహా కార్యాన్ని సాకారం చేయడంలో విశేష కృషి చేసిన గాంధీ మెమోరియల్ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, వారి కార్యవర్గ సభ్యుల బృందాన్ని జయరాం కోమటి అభినందించారు.





























