లండన్లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటనతో లండన్లోని భారత సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది.నార్త్ రోడ్లోని డోర్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగింది.

కత్తిపోట్లపై సమాచారం అందుకున్న లండన్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడి ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన గుర్భేజ్ సింగ్ను రక్షించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన 30 ఏళ్ల మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలంలోనే 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు వ్యక్తులను అనుమానంపై అరెస్ట్ చేశారు.





























