Skip to main content

Namaste NRI

ముగిసిన బెయిల్‌ గడువు..కేజ్రీవాల్ తిరిగి జైలుకు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులో లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్‌ చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్‌ గడువు ముగిసింది. బెయిల్‌ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సాయంత్రం తీహార్‌ జైలులో లొంగిపోయారు.

 తీహార్‌ జైలులో లొంగిపోవడానికి ముందు అరవింద్‌ కేజ్రీవాల్‌ తన తల్లిదండ్రుల ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. భార్య సునీత, ఆప్‌ నేతలతో కలిసి రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆ తర్వాత హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదని తెలిపారు. కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వం తొలగిన తర్వాత తాను జైలు నుంచి విడుదలవుతానని చెప్పారు. దేశాన్ని కాపాడేందుకే తాను జైలుకు వెళ్తున్నానని ఆయన అన్నారు.

Social Share Spread Message

Latest News