బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరిగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్నారు.
ఈజిప్టులోని షెర్మెల్ షేక్లో వచ్చే వారం జరగనున్న పర్యావరణ సదస్సుకు హాజరవుతానని రిషి సునాక్ ప్రకటించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టడానికి వీలుగా సదస్సుకు ఆయన దూరంగా ఉంటారని వార్తలు రావడంతో విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సదస్సుకి హాజరవుతానంటూ రిషి తెలిపారు. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాల శ్రేయస్సు సాధ్యం కాదు. పునరుత్వాదక వనరులపై ఖర్చు చేయకపోతే ఇంధన భద్రత కుదరదు. అందుకే సదస్సుకు హాజరవుతా. భద్రమైన భవిష్యత్ కోసం ఎలా మెలగాలో మాట్లాడతాను అన్నారు.














