ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్మీట్ పెట్టుకొని తమను బెదిరించినట్లుగా మాట్లాడటం సరికాదని, అందరం కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగు అగ్ర నిర్మాతలు కోరారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రెస్మీట్ను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా తెలుగు నిర్మాతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎగ్జిబిటర్ల మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అగ్ర నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం చూపించాలని నిర్మాతలు కోరారు.

ఈ సందర్భంగా మైత్రీ మూవీస్ యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ఎగ్జిబిటర్ల ఇబ్బందుల పట్ల మాకు అవగాహన ఉంది. అదే సమయంలో నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. నాలుగైదు నెలలుగా సరైన సినిమాలు లేక ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. పెద్ది రూపంలో ఓ మంచి సినిమా వస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి. అన్ని థియేటర్లలో వసతులు వుండవు కాబట్టి అన్నింటిని ఒకే విధంగా పరిగణించలేం. అందరం కలిసికట్టుగా చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నారు.





























