విష్యక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్ హీరోయిన్. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా అంటే పిచ్చి ఉండకూడదు కానీ ప్యాషన్ ఉండాలని అనుకుంటాను. పిచ్చికి, ప్యాషన్కు తేడాలు ఏంటని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా చూస్తే ప్యాషన్ అంటే ఏంటో తెలుస్తుంది. దాస్ కా ధమ్కీ ట్రైలర్ బాగుంది సినిమా సక్సెస్ అవుతుందనే అనిపించింది అన్నారు. విభిన్న రకాల సినిమాలు చేస్తూనే ఇటు హీరోగా, అటు దర్శక నిర్మాతగా కూడా విశ్వక్ సేన్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి యువతరంలో ఇలాంటివారు అరుదు. దాస్ కా ధమ్కీ థియేటర్స్లో చూడాల్సిన చిత్రం అన్నారు. విష్యక్ సేన్ మాట్లాడుతూ రాజీ పడకుండా, మనసు పెట్టి సినిమా చేశాం అన్నారు. కరాటే రాజు మాట్లాడుతూ మా ప్రొడక్షన్లో ఫస్ట్ ఫలక్నుమా దాస్ తీశాం. విజయం దక్కింది. ఇప్పుడు దాస్ కా ధమ్కీ తో వస్తున్నాం నాలుగు సినిమాల కష్టం ఈ ఒక్క సినిమాకే పడుతున్నాం. ఆ కష్టం స్క్రీన్పై కనిపిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, యశ్, పూర్ణాచారి, ఎడిటర్ అన్వర్ అలీతో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది.














