యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానసిక ప్రశాంతత ఇచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికా లోని వర్జీనియాలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ పతంజలి మహర్షి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ యోగ అనేది శారీరక వ్యాయామమే కాదు శరీరం మరియు మనస్సును సమన్వయం చేసే గొప్ప భారతీయ సంప్రదాయ కళ అని అన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుత కాలంలో పని వత్తిడి ఆందోళన అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మన జీవితంలో అత్యంత అవసరమైన సాదనం గా యోగా మారిందన్నారు. ప్రధాని నరేంద్ర మోది , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ప్రక్రియను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గత ఏడాది యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కు ఎక్కింది అని అన్నారు.


ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచిన భాను ప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చును అన్నారు. మన పెద్దలు మనకు అందించిన అమూల్యమైన కానుక అన్నారు యోగాను 175 దేశాల్లో ఆచరిస్తున్నారు అని తెలిపారు. ప్రవాసాంద్రుల పేరెంట్ సంఘం అధ్యక్షులు మైనేని రామ్ ప్రసాద్ మాట్లాడుతూ యోగా ప్రకృతి ప్రసాదించిన వరం అని నిలబెట్టుకోవడం , సాదన చేయడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ అమరవాది యోగా లో పలు మెలకువలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసాంద్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






























