దక్షిణాది చిత్ర పరిశ్రమతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి ప్రేక్షకులు చూపించిన ప్రేమను మర్చిపోలేమని, తెలుగు సినిమాలో నటించాలని ఉందని తెలిపింది బాలీవుడ్ తారా జాన్వీ కపూర్. తన కొత్త సినిమా మిలి విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ నా కెరీర్లో ఎక్కువ శ్రమించిన చిత్రమిదే. కథానుసారం ఫ్రీజర్ గదిలో గంటలపాటు గడపాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడ్డాను. అమ్మ శ్రీదేవి దిగ్గజ నాయికగా పేరు తెచ్చుకుంది. ఆమె వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చినందుకు గర్వపడుతున్నా. దక్షిణాది ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. తెలుగుతో పాటు సౌత్ సినిమాల్లో నటించాలని ఉంది. గతంలో ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చిన అవి కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ సరసన నటించాలని ఉంది అని చెప్పింది. బోనీ కపూర్ మాట్లాడుతూ తెలుగులో నా సతీమణి శ్రీదేవికి లభించినట్లుగానే నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను అన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది.














