ఆంధ్ర కళా వేదిక ఖతార్ కార్యవర్గం కార్తీక మాసం సందర్భంగా ఖతార్లోని తెలుగు వారందరి కోసం కార్తీకమాస వనభోజనాల కార్యక్రమాన్ని ఈ నెల 28న మెసయిద్లోని ఫామిలీ పార్క్లో నిర్వహించారు. ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్లోని తెలుగు వారి నుండి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ౩౦౦కి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకుని రికార్డు సృష్టించారు అని తెలిపారు.
పలువురు తెలుగు ప్రముఖులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ నుండి రజని మూర్తి, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్, తెలుగు బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు లూఫ్తీ, సత్యనారాయణ మలిరెడ్డి, గొట్టిపాటి రమణ, హరీష్ రెడ్డి, తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో(తంబోలా, టగ్ ఆఫ్ వార్, ట్రేజర్ హంట్, ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడు గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలు (2 Grams) అందించారు. ఉసిరి చెట్టు కొమ్మల క్రింద రుచికరమైన సాంప్రదాయ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కేటీ రావు, వీబీకే మూర్తి, శిరీషా రామ్, సాయి రమేష్, సోమరాజు, రవీంద్ర, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు అధ్యక్షులు వెంకప్ప భాగవతుల. కార్యక్రమానికి సుమారు 450 మంది హాజరయ్యారని, ఎండను, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా విచ్చేసిన చిన్న పెద్ద అందరూ కార్యక్రమాన్ని ఆసాంతం ఆనందించారని అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన స్పాన్సర్స్కు సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.














