అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా నగరంలో NRI టీడీపీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 30న జరిగిన మీట్ అండ్ గ్రీట్ సభకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు ఏ.వీ. రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ.వీ. రమణ మాట్లాడుతూ జగన్ రెడ్డి తన సైకో మనస్తత్వంతో కుల, మత, ప్రాంత విద్వేషాలను రెచ్చగొడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెడుతూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి ప్రదేశ్గా ఉండేదని, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అరాచకం,అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారిపోయిందని అన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నాయకత్వమోక్కటే మార్గమని అన్నారు. అందుకనే నాయకులందరూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడమే ఏకైక లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాసులు ప్రసంగిస్తూ…చంద్రబాబు పాలనలో ప్రవాస భారతీయులు ఏపీలో పెట్టుబడులుపెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చేవారని, కానీ ప్రస్తుత జగన్ అరాచక పాలనలో ప్రవాస భారతీయులు అసలు ఆంధ్రప్రదేశ్కు రావడానికే భయపడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఐటీ కంపెని అధినేత వీరమాచినేని శ్రీధర్, ప్రముఖ పారిశ్రామికవేత్త డా.దేవయ్య పగిడిపాటి, శ్రీనాథ్ రావుల, శ్రీనివాస్ మల్లాది, NRI టీడీపీ ఇంచార్జ్ అజయ్ దండమూడి, ప్రశాంత్ పిన్నమనేని, శివ తాళ్లూరి, ప్రసాద్ కొసరాజు, నాగేంద్ర తుమ్మల తదితరులు పాల్గొన్నారు..














