మెగాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రామ్చరణ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. జాన్వీకపూర్, శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రధారులు. బుచ్చిబాబు సానా దర్శకత్వం. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను ముంబయిలో విడుదల చేశారు. ట్రైన్ సీక్వెన్స్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్గా సాగింది. పెద్ది తాలూకు ప్రపంచాన్ని పరిచయం చేయడం, అతన్ని క్రికెటర్గా, కుస్తీ యోధుడిగా, పరుగుల వీరుడిగా, ఇలా భిన్న ఆటల్లో ప్రావీణ్యం ఉన్నవాడిగా చూపించడం ఆసక్తిని పెంచింది. మీరు అందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను అంటూ పెద్ది చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది.

రామ్చరణ్ మాట్లాడుతూ ఇది చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఓ యువకుడు గుర్తింపు కోసం చేసే ప్రయాణమిది. నా కెరీర్లో అత్యంత స్ఫూర్తివంతమైన సినిమా. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. మగధీర, రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు తరచుగా రావు. పెద్ది కూడా అలాంటి సినిమానే. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.





























