ప్రవాసులను పనిలో పెట్టుకునే సౌదీ అరేబియా యజమానులకు తాజాగా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. వర్క్ పర్మిట్ లేకుండా లేదా అజీర్ ప్రోగ్రామ్కు తెలియజేయకుండా ప్రవాసులను పనిలో పెట్టుకుంటే ఏకంగా 5వేల సౌదీ రియాళ్ల (రూ.1.10లక్షలు) జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పెనాల్టీ అనేది కార్మిక చట్టంలోని ఉల్లంఘనలు, జరిమానాలకు సంబంధించి ఇటీవల సవరించిన షెడ్యూల్ ఆధారంగా మంత్రిత్వ శాఖ నిర్ధారించినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ ఉల్లంఘనకు ఏకంగా 1500 నుంచి 5వేల సౌదీ రియాళ్ల వరకు ఫైన్ ఉంటుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
15ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం కూడా తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంటూ, దీనికి గాను వెయ్యి నుంచి 2వేల రియాళ్ల వరకు జరిమానా ఉంటుందని తెలిపింది. అలాగే యజమాని వర్క్ పర్మిట్ పొందకుండా లేదా అజీర్ ప్రోగ్రామ్కు తెలియజేయకుండా సౌదీయేతర వర్కర్ను నియమించుకోవడం చేస్తే 10వేల సౌదీ రియాళ్ల (రూ.2.20లక్షలు) ఫైన్ ఉంటుందని మంత్రిత్వశాఖ తెలియజేసింది.














