Namaste NRI

శివపద జ్ఞాన యజ్ఞం – 4 వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు

శివుని ఢమరుకం నుండి 14 మహేశ్వర సూత్రాలు వెలువడి ఆ నాదం శబ్ద ప్రపంచం గా విస్తరించినట్టుగా, పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి అంతరంగం నుండి ఉద్భివించినవి దాదాపు 1100 పైగా అద్భుతమైన శివపద గీతాలు. ఋషిపీఠం ఆధ్వర్యంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో నాల్గవ శివపద అంతర్జాతీయ పాటల పోటీ ఈ నెల (మే 2024)  16,17,18, న యూట్యూబ్ మాధ్యమంగా నిర్వహించారు.

ఎప్పటిలాగే, ఈ శివపదార్చన లో, అనేక దేశాల నుంచి  7 – 70 సంవత్సరాల వయస్సులో వారు దాదాపు 250 మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ పోటీలలో పాల్గొనటానికి సన్నధ్ధులవుతన్నప్పటి నుంచీ  శివపద ఝరి లో ఓలలాడామని పాల్గున్న వారు అన్నారు. వయసుల వారీగా “ఉపమన్యు “, “మార్కండేయ”, “భక్త కన్నప్ప”, “నత్కీర”,”పుష్పదంత ” అనే 5 విభాగాలుగా విభజించారు.13 మంది  ప్రఖ్యాత  సంగీతగురువులు US, భారత్ ,ఆస్ట్రేలియా, సింగపూర్  నుంచి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తులసి  విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా  సుబ్రమణియన్,  కౌశిక్ కల్యాణ్,పెద్దాడ  సూర్యకుమారి గారు,   RV లక్ష్మి  మూర్తి గారు , విష్ణుప్రియ భరధ్వాజ్ గారు,  శ్రీ కాంత్ మల్లాజ్యోస్యుల గారు, లక్ష్మిశేష భట్టుకు, సరస్వతి కాశి గారు,  అనీల కుమార్ గరిమెళ్ళ గారు, లలిత రాంపల్లి గారు. శేషు  కుమారి యడవల్లి గారు,  అరవల్లి శ్రీదేవి గారు, విద్య భారతి  గారు తదితరులు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.

అందరి పాటలనూ విన్న బ్రహ్మ శ్రీ షణ్ముఖ శర్మ గురువుగారు, జీవిత ప్రయాణమే శివ మయం అనీ, ఈ శివ పద జ్ఞాన యజ్ఞం ప్రపంచవ్యాప్తం గా విస్తరించటం, తద్వారా పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియబడటం ఎంతో ముదావహం అన్నారు.  పాల్గొన్న అందరికీ, శ్రధ్ధగా విని, తమ నిర్ణయాలనీ, సూచనలనీ అందించిన న్యాయ నిర్ణేతలందరికీ  శివాశీస్సులు అందించారు.

ఈ సంవత్సరం ఋషిపీఠం రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, శివపదం గానం, నృత్యము ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందటం, మరింత సంతోషం కలిగించే విషయమని , ఈ పోటీలను నిర్వహిస్తున్న గుండ్లపల్లి వాణి గారు అన్నారు. ఈ సందర్భం గా కాసాబ్లాంకా, బాలి, గ్రీస్ వంటి దేశాలలో శివపద నృత్య ప్రదర్శనలు నిర్వహించామని, ఇందులో పాల్గొనే చిన్నారులు, పెద్దలూ అందరూ కూడా మన ” కల్చరల్ అంబాసడార్స్” అని అన్నారు.

ఈ కార్యక్రమం ఇంత అద్భుతం గా సాగటానికి కారణమైన ఋషిపీఠం వారికి , ఓలేటి వెంకట పవన్ గారు, శ్రీనివాస్ మేడూరి గారు, మేఘన వారణాసి శ్రీ కాంత్ వడ్లమాని గారికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు వాణి గారు. అలాగే  శివపద బృందం అయినటువంటి  నాగ సంపత్  వారణాసి, విజయ వడ్లమాని, రవి గుండ్లాపల్లి గార్లకు ధన్యవాదాలు తెలిపారు.  శివపద బృందానికి గురువుగారు ప్రత్యేక ఆశీస్సులు తెలియ చేశారు. రాధికా కామేశ్వరి కి ప్రత్యేక ధన్యవాదాలు. వందల గళాలలో సాగిన ఈ శివ పదార్చన  వేల గళాలలో లో జరగాలని ,ఋషిపీఠం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని మనసారా ఆశిద్దాము.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events